సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి-సత్తెనపల్లి : ప్రతి భవనిర్మాణ కార్మికుడు సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు అవ్వారు ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పోలేరమ్మ గుడి సెంటర్లో జరిగిన సత్తెనపల్లి తాపీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి బొల్లెపల్లి మహేష్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రతి భవన నిర్మాణ కార్మికుడు సంవత్సరంలో ఒకరోజు వేతనాన్ని చెల్లించి సత్తెనపల్లి తాపీ వర్కర్స్ యూనియన్ సభ్యత్వం పొందాలని అన్నారు. యూనియన్ సభ్యత్వం పొందిన భవన నిర్మాణ కార్మికుడు ఏ కారణం చేతనైనా మృతి చెందినచో మట్టి ఖర్చులకు రూ.10 వేలు, ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికునికి రూ.5 వేలను యూనియన్ ద్వారా అందిస్తామని చెప్పారు. అనంతరం ఏడుగురుతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా బొల్లెపల్లి మహేష్, పాపిశెట్టి ఆదినారాయణ, ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, సహాయ కార్యదర్శిగా వాసి బాలస్వామి, కోశాధికారిగా పసుపులేటి సీతయ్య, సభ్యులుగా చేపూరి ఏడుకొండలు, సుకమంచి వెంకట్రావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో తాపీ మేస్త్రులు పాపిశెట్టి బాలచంద్రరావు, దరిపల్లి రామకోటయ్య, శివయ్య, ఇమామ్ వలి, పుట్ట నరసింహారావు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/sap-1.jpg)