డిసెంబర్‌ 16,17 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు

డిసెంబర్‌ 16,17 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : డిసెంబర్‌ 16,17 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ 31వ జిల్లా మహాసభలు నెల్లిమర్లలో జరుగు తాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి హెచ్‌ వెంకటేష్‌, పి.రామ్మోహన్‌ తెలిపారు.గురువారం స్థానిక ఎల్‌ బి జి భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతూ జిల్లాలో విద్యా రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారిన ప్రభుత్వ విధానాలపై ఉద్యమాలు చేస్తోందన్నారు. ఈనేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్‌ కర్తవ్యాలను రూపొందించుకునేందుకు మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 200మంది ప్రతినిధులు సభలకు హాజరు కానున్నారని, జిల్లాలో గత మహాసభల నుంచి ఇప్పటి వరకు విద్యా రంగంలో వచ్చిన సమస్యలు పరిష్కారం కోసం, విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై చేసిన పోరాటాలు, విజయాలు, భవిష్యత్తు కర్తవ్యాలపై చర్చించి నిర్ణయాలు చేస్తామని తెలిపారు. జిల్లాలో సరిపడా ప్రభుత్వ కళాశాలలు లేవని, ఉన్న కాలేజీల్లో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. జెఎన్‌టియు యూనివర్సిటీ గా మారినప్పటికీ అందుకు సరిపడా నిధులు లేక సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ప్రభుత్వం విద్యా రంగానికి సరిపడా నిధులు కేటాయించక పోవడం వంటి సమస్యలపై చర్చించి భవిష్యత్‌ కర్తవ్యాలను రూపొందిస్తామని తెలిపారు. మేధావులు, విద్యా వేతలు, జిల్లా ప్రజలు అన్ని విధాలా సహకరించి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో నాయకులు రాము, రవి, హర్ష, వెంకీ తదితరులు పాల్గొన్నారు.

➡️