వివరాలు అడుగుతున్న జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి
ప్రజాశక్తి – గుంటూరు : ఎన్నికల్లో రాజకీయపార్టీలు, అభ్యర్థుల ఖర్చులను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ అభ్జర్వర్లు సరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అభ్జర్వర్లు, అకౌంటింగ్ టీం అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు. అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ అభ్జర్వర్లు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీడియో సర్వేలెన్స్ తదితర టీంలను సమన్వయం చేసుకుంటూ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార ఖర్చులను నమోదు చేయాలన్నారు. నిర్దేశిత ఫార్మేట్లో నివేదికలను ప్రతిరోజూ రిటర్నింగ్ అధికారికి, జిల్లా స్థాయిలోని ఎక్స్పెండీచర్ను మానిటరింగ్ సెల్కు అందించాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ధరల ప్రకారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో వినియోగించే అన్ని రకాల వస్తువులకు ఖర్చులను నమోదు చేయాలన్నారు. అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ అభ్జర్వర్లు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యటిస్తూ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రతి ఖర్చునూ అకౌంటింగ్ టీం ద్వారా నమోదు చేయించాలన్నారు. గ్రీవెన్స్ రీడ్రసెల్ కమిటీ సమావేశంజిల్లా స్థాయి గ్రీవెన్స్ రీడ్రసెల్ కమిటీ (సీజర్స్) సమావేశం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో సీజ్ చేసిన వస్తువులకు సంబంధించిన ఫిర్యాధులను కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షించి సూచనలు చేశారు. సమావేశాల్లో జిల్లా రెవెన్యూ అధికారి పి.రోజా, ఎక్స్పెండీచర్ కమిటీ నోడల్ అధికారి శివరామకృష్ణ, జిల్లా ఖజనా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజగోపాల్, గ్రీవెన్స్ రీడ్రసెల్ కమిటీ కన్వినర్ హరిహరనాథ్, ఐటీ నోడల్ అధికారి రఘు, అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ అభ్జర్వర్లు, అకౌంటింగ్ టీం అధికారులు పాల్గొన్నారు.