ప్రజాశక్తి – బాపట్ల
ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అపారమైన వనరులు ఉన్నాయని టిడిపి ఎంపి అభ్యర్ధి తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. వనరులను సద్వినియోగం చేసుకొని యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. పట్టణంలో ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి అధికారంలోకి రాగానే బాపట్ల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. గతంలో హైటెక్ సిటీ ఏర్పాటులో చంద్రబాబుతో కలిసి పనిచేసిన అపార అనుభవం తమకుందని అన్నారు. సంపద సృష్టికి అవసరమైన అనేక వనరులు ఈ ప్రాంతంలో మెండుగా ఉన్నాయని అన్నారు. తాడేపల్లికి అనుసంధానం చేస్తూ పరిశ్రమల హబ్గా బాపట్లను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళతామని అన్నారు. ఈ ప్రాంత నూతన శకం సృష్టికి పాటుపడతామని అన్నారు. ఏదో ఎంపీగా గెలిచాము ప్రజలకు కనపడకుండా పోయామనే భావన వీడి, అభివృద్ధిని ఆకాంక్షించి టిడిపికి ఓటేసి ఎంఎల్ఎగా నరేంద్ర వర్మను, ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. సమావేశంలో టిడిపి బాపట్ల జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, టిడిపి ఎంఎల్ఎ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ, ఎన్నికల పరిశీలకులు బాచిన చెంచు గరటయ్య పాల్గొన్నారు.