పేదల సంక్షేమానికే పథకాలు: సిడిపిఒ

ప్రజాశక్తి-పొదిలి దేశంలో పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిడిపిఒ సుధా మారుతి అన్నారు. బుధవారం మండలంలోని గ్రామాలలో వికసిత భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాలు పాములపాడు, ఈగలపాడు గ్రామాలలో సర్పంచ్‌లు పేరం చంద్రమ్మ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు, బాలింతల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ భవిష్యత్తు చిన్నారులకు పోషకాహార లోపం లేకుండా కేంద్రం అమలు చేస్తుందన్నారు. తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేయడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమాలలో వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందించే 17 పథకాల గురించి, వాటి అమలు గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో అమలు జరుగుతున్న పథకాలను అర్హులకు వివరించారు. గ్రామ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకపొతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు. ఎంఈఒ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశలో మంచి తరగతి గదులు విద్యా వనరులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వెలుగు ఏపిఎం మాణిక్యరావు, వ్యవసాయాధికారి ఎస్‌కె జైనులాబ్దిన్‌, పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. గ్రామంలోని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాస రచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.

➡️