పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వంద శాతం కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలలో కనీస సౌకర్యాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై నియోజకవర్గ ఇఆర్‌ఒలు, ఆర్డబ్ల్యూఎస్‌, స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌, పంచాయతీ రాజ్‌, విద్యుత్తు, ఆర్‌అండ్‌బి శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1607 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ కేంద్రాలలో కనీస సౌకర్యాలు ర్యాంపు, తాగునీరు, నీటి వసతితో మరుగుదొడ్డి, ఫర్నిచర్‌, విద్యుత్‌ సౌకర్యం, లైటింగ్‌ పరికరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇఆర్‌ఒలు ఇచ్చిన నివేదిక మేరకు ఆయా నియోజకవర్గాలలోని పోలింగ్‌ కేంద్రాలలో ర్యాంపులు 259, తాగునీరు 87, నీటి వసతితో మరుగుదొడ్లు 118, ఫర్నిచర్‌ ఏర్పాటు 204, విద్యుత్‌ సౌకర్యం 64, లైటింగ్‌ పరికరాలు 83 పిఎస్‌ లలో ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇఆర్‌ఒలు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కషిచేసి ఈ నెల 25 లోగా నూరు శాతం పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలను మరొకసారి క్షుణ?ంగా తనిఖీ చేసి ఇంకను కనీస సౌకర్యాలను కల్పించాల్సిన వాటిని గుర్తించాలన్నారు. బిఎల్‌ఒలు, తహశీల్దార్లు, ఇఆర్‌ఒలు, ఆయా అంశాల జిల్లా అధికారులు పోలింగ్‌ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించి కనీస వసతులు లేని స్కూల్స్‌, కాలేజీల వివరాలు సమర్పించాలని చెప్పారు. ఈ నెల 25 తర్వాత ఎన్నికల నిర్వహణపై సెక్టరుల అధికారులకు శిక్షణ ఏర్పాటు చేయాలని ఇఆర్‌ఒలకు సూచించారు. ఇందుకు షెడ్యూల్‌ రూపొందించాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేందన్న ఆ పోలింగ్‌ కేంద్రం నెంబరు పెయింటింగ్‌ చేయించాలని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాల మార్పు, పేరు మార్పుల వివరాలను వెంటనే సమర్పించాలన్నారు. అన్ని మండలాలు, నియోజకవర్గాలలో ఇవిఎంల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు బాగా నిర్వహించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలలో తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫక్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఓ సత్యనారాయణ, ఆర్డీఓలు రంగస్వామి, మురళి, రామకృష్ణారెడ్డి, పీలేరు, తంబళ్లపల్లె, కోడూరు ఇఆర్‌ఒలు గోపాలకృష్ణ, రాఘవేంద్ర, మల్లికార్జునరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ప్రసన్న కుమార్‌, డిఇఒ శ్రీరాం పురుషోత్తం, పిఆర్‌ ఎస్‌ఇ దయాకర్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ఎ జిల్లా కో-ఆర్డినేటర్‌ కరుణాకర్‌, ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐఒ కృష్ణయ్య, విద్యుత్‌, ఆర్‌అండ్‌బి డిఇలు చంద్రశేఖరరెడ్డి, సహదేవరెడ్డి, సంబంధింత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️