ప్రజాశక్తి- బాడంగి : ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. మండలంలోని డోంకినవలసలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, హెల్త్ క్లినిక్ సెంటర్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మాదిరిగా మండల కేంద్రాలకు తిరిగే పనిలేకుండా తమ గ్రామంలోనే ప్రభుత్వం అందించే అనేక రకాల సేవలు వినియోగించుకునేలా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ రూపొందించిందన్నారు. సచివాలయ ఉద్యోగులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పెద్దింటి రామారావు, డిఇ అప్పారావు, వైసిపి నాయకులు తెంటు మధుసూదన్, మండల కన్వీనర్ బి వెంకట్ నాయుడు, జెసిఎస్ కన్వీనర్ మరిపి శంకర్ రావు, సర్పంచులు, ఎంపిటిసిలు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/bdg-mla-2.jpg)