ఫొటో : మోకాళ్లపై కూర్చొని నిరసన చేపడుతున్న అంగన్వాడీలు
బలవంతంగా కేంద్రాలను తీయొద్దు..
ప్రజాశక్తి-ఉదయగిరి : అంగన్వాడీలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తెరవద్దని సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం 4వ రోజు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు మోకాళ్లపై నిరవధిక సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లను దౌర్జన్యంగా తెరవకూడదని సమ్మె చేపట్టే వారిని వత్తులకు గురి చేయరాదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే అడుగుతున్నామే తప్ప మరొక కోరిక కాదని వెంటనే జరిగే పార్లమెంటు సమావేశంలో అంగన్వాడీల సమస్యలు చర్చించి సమస్యను పరిష్కరించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీల వేతనాలు పెంచి మినీ వర్కర్లను మెయిన్గా చేసి రూ.26వేల వేతనం అందించి సుప్రీంకోర్టు జిఒలు ప్రకారం గ్రాట్యూటీని అందజేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఎఫ్ఆర్సి యాప్ను రద్దు చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అంగన్వాడీ కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందన్నారు. భారత్ మజ్దాదర్ సంఫ్ు నాయకురాలు షేక్ చాంద్ బేగం మద్దతు తెలిపి అంగన్వాడీల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్షరాలు ప్రమీల, నాయకులు రమాదేవి, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.