సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం
సిఐటియు నాయకులు హెచ్చరిక
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 52రోజులుగా ఆందోళన చేస్తున్న మిమ్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో ఉద్యోగులు శుక్రవారం నగరంలోని మిమ్స్ హెల్త్కేర్ సెంటర్ వద్ద పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి హెల్త్ కేర్ సెంటర్కు వచ్చిన వైద్యులను అడ్డుకొని లోపలికి వెళ్లనేయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, నాయకులు టివి రమణ మాట్లాడుతూ మిమ్స్ ఉద్యోగులకు వేతన ఒప్పందం చేయాలని, బకాయి డిఎలను ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతుంటూ యాజమాన్యం చర్చలకు రాకుండా ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. చర్చలకు పిలవకుండా ఉద్యోగులను బెదిరించడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు. వెంటనే యాజమ్యనం స్పందించి చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.