ప్రజాశక్తి-మదనపల్లి రక్తదానం ప్రాణదానంతో సమానమని మిట్స్ డైరెక్టర్ నాదేళ్ల ద్వారకనాథ్ అన్నారు. మంగళవారం మిట్స్ కాలేజ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, కంటి పరీక్షల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత, అవసరమన్నారు. రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్పదానమని తెలిపారు. ఇదొక నిస్వార్థమైన చర్య, సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడా. రక్తదానం చేయడంలోనూ దాతలు సురక్షితమైన రక్తాన్నే దానం చేయాలన్నారు. అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుందన్నారు. గణాంకాల ప్రకారం. మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి ఏడుగురిలో ఒకరికి రక్తం అవసరం అవుతుందని చెప్పారు. అర్హులైన వారిలో కేవలం 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నామన్నారు. కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చు అనే భయంతో వెనకడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి రక్తదానం చేయడం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాపడటమే కాకుండా రక్తదాతకు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. సుమారు 120 మంది రక్త దానం చేశారు. కార్యక్రమంలో భాస్కరాచారి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గౌతమ్, మహేష్, డాక్టర్ నివేదిత, డాక్టర్ అమరావతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, డాక్టర్ తులసి రామ్ నాయుడు, డాక్టర్ చెన్నయ్య, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/7-26.jpg)