సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంలో నిర్వహించే ఆడుదాం ఆంధ్ర క్రీడలలో జిల్లాకు కప్ వచ్చేలా కషి చేయాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ కోరారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఆడుదాం ఆంధ్రపై సంబందిత అధికారులతో జెసి మంగళవారం సమీక్షించారు. జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలను విజయవంతం కోసం ప్రణాళిక ప్రకారం పని చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గం నుండి మహిళా టీములు-5, అదే విధంగా పురుషులు 5 టీములు కలిపి నియోజకవర్గానికి 10 టీముల వంతున మొత్తం 70 టీములు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయన్నారు. ఖోఖో క్రీడలు నరసరావుపేటలోని శంకరభారతిపురం పాఠశాలలో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ పోటీలను జిల్లా క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల నిర్వాహణలో వైద్యాఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, విద్యా శాఖల సేవలు వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 6వ తేదీ నుండి విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడల్లోనూ జిల్లా క్రీడాకారులు రాణించి పల్నాడు జిల్లాకు కప్ వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజినల్ అధికారి శేషిరెడ్డి, తహశీల్దార్ రమణ నాయక్, డిఎస్డిఓ సురేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.