ప్రజాశక్తి-చల్లపల్లి :ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ చల్లపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం వామపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ సమితి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వాకా రామచందర్రావు మండల నాయకులు మహమ్మద్ కరీముల్లా, మేడంకి వెంకటేశ్వరరావు, గోళ్ళ సాంబశివరావు, పెయింటర్ బాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీర్ రిజ్వాన్, నాయకులు కొండవీటి భాస్కరరావు రైతులు పాల్గన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని , రైతుల రుణమాఫీ చేయాలని , కేరళ రాష్ట్ర తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం దొడ్డి దారిన ప్రవేశపెట్టి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని, కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి కి రెండు లక్షల కోట్లు కేటాయించి 200 రోజులు పని దినాలు పెంచాలని కోరారు.అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇంచార్జ్ డిప్యూటీ తహశీల్దార్ శారదకు అందించారు.