ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు
రైల్వే స్వీపర్స్కు జీతాలు చెల్లించాలి
ప్రజాశక్తి-కావలి రూరల్ : కావలి రైల్వే స్టేషన్లో సుమారు ఐదు సంవత్సరాల నుండి స్వీపర్స్గా పనులు చేస్తున్న కార్మికులకు కట్టవలసిన పిఎఫ్, ఇఎస్ఐ, ఐదు సంవత్సరాల నుండి కార్మికుల పేరుతో జమ కాలేదని, మూడు నెలల జీతాలను చెల్లించాలని కోరుతూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ మాస్టర్ ఎం అశోక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్కె రెహనా బేగం మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో స్వీపర్లుగా ఐదు సంవత్సరాల నుండి 6 మంది కార్మికులు పనులు చేస్తున్నారని వీరి పేరుతో కాంట్రాక్టర్ పిఎఫ్, ఇఎస్ఐ, ఇప్పటివరకు జమ చేయలేదన్నారు. అంతేకాకుండా మూడు నెలల నుండి జీతాలు చెల్లించలేదని, ఇదేమని రైల్వే అధికారులను సిఐటియు యూనియన్గా అడగ్గా ఆ కాంట్రాక్టర్ పీరియడ్ అయిపోయిందని, తమకేమీ సంబంధం లేదని కాంట్రాక్టర్ను అడగాలని సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ కార్మికులు పనులు చేస్తుంటే అధికారులు వారితో పనులు చేయించుకుంటూ వీరి సమస్యలు అధికారులకు పట్టదా అని ప్రశ్నించారు. వీరికి 1-10 -2023 ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ వీరికి పిఎఫ్, ఇఎస్ఐ, కటింగ్ పోనూ రూ.12,500 జీతం ఇవ్వాల్సి ఉందని కానీ 7500 ఇచ్చి కార్మికులను శ్రమ దోపిడీ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వీరికి రావాల్సిన జీత బకాయిలు ఇవ్వాలని కార్మికుల పేరుతో ఐదు సంవత్సరాలుగా జమ చేయాల్సిన పిఎఫ్, ఇఎస్ఐలను జమ చేసి ఆ కాంట్రాక్టర్పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ఈ స్టేషన్లో పారిశుధ్య పనులు సుమారు 20మంది చేయాల్సిన అవసరం ఉందని గతంలో చిన్న స్టేషన్గా ఉన్నప్పుడు 17మంది కార్మికులు పనులు చేసేవారని ఆ తరువాత తగ్గుతూ 6 మంది కార్మికులే ప్రస్తుతం పనులు చేస్తున్నారని ఇది చాలా దారుణమన్నారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ బాగా పెరిగిందని, ప్లాట్ ఫారాలు ఎక్కువ పెరిగాయని పార్కులు స్టేషన్ రూములు బాగా పెరిగాయని, దాన్నిబట్టి కార్మికులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ మందితో ఎక్కువ పనులు చేయించడం చాలా అన్యాయమన్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు రైల్వే స్టేషన్ పరిధిని బట్టి కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. అలా లేనిపక్షంలో కార్మికులను పెంచకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్, కార్మికులు పాల్గొన్నారు.