ప్రజాశక్తి – దాచేపల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్పెంటర్లు దుర్మరణం పాలైన ఘటన దాచేపల్లి మండలం తంగెడ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండల కేంద్రమైన మచవరానికి చెందిన సయ్యద్ జమాల్ (50), మాచవరం మండలంలోని వేమవరానికి చెందిన ఎస్కె జానిబాష (45) ఇద్దరూ మాచవరంలోని ఓ పౌండ్రీలో కార్పెంటర్లుగా పని చేస్తున్నారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా పౌండ్రీకి సెలవు కావడంతో వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై తెలంగాణ వైపు వ్యక్తిగత పనులపై వెళ్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన సిమెంట్ లోడు లారీని మృతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ఎదుట వద్దకు రాగానే ఓవర్టేక్ చేస్తుండగా బైక్ అదుపుతప్పి స్కిడ్ కావడంతో బైక్ నడుపుతున్న జానీబాష, వెనక కూర్చున్న జమాల్ కిందపడి పోయారు. వారిపై లారీ వెనక టైర్లు ఎక్కి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలిని దాచేపల్లి ఎస్ఐ నాగరాజు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురుజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీని పోలీస్స్టేషన్కు తరలించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.