ప్రజాశక్తి- అనకాపల్లి :
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, జిఆర్పి, ఆర్పిఎఫ్, రవాణా శాఖ, ఆర్టీసీ తదితరశాఖల అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఎస్పి మురళీకృష్ణ కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం, గంజాయి, ఉచిత కానుకలు పంపిణీ చేసేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అటువంటి కార్యకలాపాలపై ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక నిఘా ఉంచి చెక్ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేటట్లు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.విజయభాస్కర్, డిటిఓ కెవి.ప్రకాశరావు, సెబ్ ఈఎస్ జయ సింహా చౌదరి, ఆర్పిఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అజరు నాందేవ్ సంసారి, సెబ్ ఏఈఎస్ డి.శైలజ రాణి, ఇన్స్పెక్టర్టు చంద్రశేఖర్, అప్పలనాయుడు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.