ప్రజాశక్తి -సీలేరు
జికె వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధి పెట్రాయి గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ పాఠశాలలో సుమారు 50 మంది పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు కూలిపోతుందో, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు వెల్లదీస్తున్నారు. కోట్ల రూపాయలు వెచ్చిన ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దినట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో అటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో కానరావడం లేదు. నాడు-నేడు పనుల్లో భాగంగా పెట్రాయి పాఠశాల భవనం నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి పెట్రాయి గ్రామంలోని పాఠశాలకు నూతన భవనం నిర్మించి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.