ఉద్యోగ విరమణ సన్మానసభలో వక్తలు
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : ఎల్ఐసి యూనియన్ నాయకులు ఎం.శ్రీనివాస అందించిన సేవలు స్ఫూర్తి దాయకమైనవని ఎల్ఐసి ఉద్యోగ సంఘాల నాయకులు, పలు ప్రజాసంఘాల నాయకులు కొనియాడారు. ఎల్ఐసి విజయనగరం బ్రాంచిలో అసిస్టెంట్గా ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ చేసిన ఎం.శ్రీనివాస అభినందన సభ శుక్రవారం స్థానిక రెవెన్యూ హోంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలిండియా ఇన్సూరెన్సు ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ మాజీకార్యదర్శి కె.వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేందుకు జరిగే ఉద్యమాల్లోను, కార్మిక పోరాటాల్లోనూ శ్రీనివాస తనవంతు కృషి చేశారని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఎల్ఐసి యూనియన్, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ఎల్ఐసి ఉద్యోగిగా, కార్మికసంఘం నాయకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు పీడిత, శ్రామిక వర్గ ప్రజలు కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రిటైర్మెంట్ అనంతరం మరింత సమయం కేటాయించి పేద, బడుగు బలహీన వర్గాల కోసం పని చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు, ఏజెంట్ల సంఘం నాయకులు, అధికారులు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస, శశికళ దంపతులను ఘనంగా సన్మానించారు.