ప్రజాశక్తి – ఏలూరు
స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు చెప్పారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డిఆర్ఒతో పాటు జెడ్పి సిఇఒ కెఎస్ఎస్.సుబ్బారావు, డిఆర్డిఎ పీడీ ఆర్.విజయరాజు, ఆర్డిఒ ఎన్ఎస్కె.ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జివివి.సత్యనారాయణ, హాజరై ప్రజలనుండి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 156 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఒ మాట్లాడుతూ స్పందన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలన్నారు. ఆయాశాఖల వారీగా అందిన అర్జీలపై క్షేత్రస్థాయిలో కూడా విచారణ చేసి ఫొటోలతో సహా నివేదికలను అప్లోడ్ చేయాలన్నారు. అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా పరిష్కారతీరు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ అర్జీలు రీఓపెన్ కాకూడదని, అలాగే పెండింగ్లో ఉంచకుండా సత్వర పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.