సహాయ కమిషనర్ గోవర్థన్ సేవలు మరువలేనివి
ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ పి.గోవర్థన్ సేవలు మరువలేనివని మేయర్ ఎస్.అముద, కమిషనర్ డాక్టర్ జె.అరుణ కొనియాడారు. సహాయ కమిషనర్ గోవర్థన్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం గురువారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… పురపాలకశాఖ పరిధిలో 38 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించడం సామాన్య విషయం కాదన్నారు. శేషజీవితం సాఫీగా సాగిపోవాలని ఆకాంక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక సంస్థలో సహాయ కమిషనర్గా గోవర్ధన్ గొప్ప సేవలు అందించారని కొనియాడారు. హెల్త్ అసిస్టెంట్గా, సానిటరీ ఇన్స్పెక్టర్ గా, సూపర్వైజర్ గా, పురపాలక కమిషనర్ గా, ప్రస్తుతం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ గా విధులు నిర్వహించి, అత్యుత్తమ సేవలు అందించాలని కొనియాడారు. సహాయ కమిషనర్ పి.గోవర్ధన్ సేవలను డిప్యూటీ మేయర్లు ఆర్.చంద్రశేఖర్, రాజేష్ కుమార్రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, ఇతర శాఖల అధికారులు, తిరుపతి కార్పొరేషన్ అధికారులు ప్రశంసించారు. ఈసందర్భంగా నగరపాలక సంస్థ తరపున మేయర్, కమిషనర్, డిప్యూటీ మేయర్లు సహాయ కమిషనర్ గోవర్ధన్ దంపతులను గజమాల, శాలువతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ చెందిన నగరపాలక డ్రైవర్ నటరాజన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఎంఎం గోపి, ఆర్ఓ గోపాలకష్ణ వర్మ, ఎంఈ గోమతి, ఏసిపీ రామకష్ణుడు, ఎంహెచ్వో డాక్టర్ లోకేష్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.