సాగుభూములకు పట్టాలివ్వాలి

ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని పనుకువలస పరిధిలో గల భూములను తమ తాతల కాలం నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఈ భూములకు సాగు హక్కు పట్టాలని ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యాన ఆ గ్రామ గిరిజనులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీసభ్యులు కె.ఈశ్వరరావు, గిరిజనులు సొండి సూర్యనారాయణ, రెయ్యి పెంటమ్మ, సొండి పోలమ్మ, పరమేశు, మర్రి శంకర్రావు, మజ్జి సొంబురు మాట్లాడుతూ గిరిజనులు తమ తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూములకు నేటికీ హక్కులు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సాలూరుకు చెందిన కొంతమంది వ్యక్తులు తమ భూములను కాజేయాలని చూస్తున్నారని, మాకు, మా భూములకు రక్షణ కల్పించి సాగు హక్కులు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ భూములు సర్వేలు చేసి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేకుంటే భవిష్యత్‌ పోరాటాలకు అధికారులు, ప్రభుత్వమే బాధ్యత పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజనుల భూములకు హక్కులు కల్పించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాముల సన్యాసి, బొడ్డ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

➡️