ప్రజాశక్తి-అనకాపల్లి
త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా వుండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరు కార్యాలయంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లుపై నోడల్ అధికార్లు, ఈఆర్ఓ, ఎఈఆర్వోలతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ చిన్న తప్పుకు అవకాశం లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులన్నింటినీ కల్పించాలని సూచించారు. వికలాంగులు, వృద్ధులకు ర్యాంపులు తప్పని సరిగా వుండాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో మోడల్ (నమూనా) పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవీయంల ద్వారా ఓటు వేసే విధానం, తమ ఓటు ఎక్కడ వుందో తెలుసుకునే విధానాల పట్ట అవగాహన కల్పించాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎమ్.కె.మీనా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెట్టరు, అధికారులు పౌల్గొన్నారు. జిల్లాలోని ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులను గురించి, ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను గూర్చి కలెక్టర్ తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో చిన్నికృష్ణ, నోడల్ అధికారులు డ్వామా పిడి ఇ.సందీప్, ఆర్అండ్బి ఈఈ రమేష్, మత్స్యశాఖ డిడి ప్రసాదరావు, ఎపిఎమ్ఐపి పిడి కెవి.లక్ష్మి, డిఎస్ఓ కెవిఎల్ఎన్ మూర్తి, పౌర సరఫరాల డియం జయంతి, లీడ్ బ్యాంక్ మేనేజరు సత్యనారాయణ, డిసిఓ కిరణ్ కుమారి, అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓలు సత్యవాణి, కె.మనోరమ, కె.గీతాంజలి, తహశీల్దార్లు పాల్గొన్నారు.