ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని సోంపురంలో ఆదివారం రాత్రి టిడిపి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు నిర్వహిస్తున్న సమావేశాలకు ప్రజాధనాన్ని వెచ్చించి ప్రజలను తరలిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సిఎం కావాలని గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులతో పథకాలు గూర్చి ప్రసారాలు చేయించడం సిగ్గు చేటన్నారు. సమావేశాలకు గ్రామ సచివాల సిబ్బందిని కూడా ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి మరల సిఎం ఎందుకు కావాలని ప్రశ్నించారు. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముకోవడానికి, గంజాయి వ్యాపారాలు చేసుకోవడానికి, ఖనిజ సంపదను, ఇసుకను విచ్చలవిడిగా దోచుకోవడానికా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేయనందుకా? ఎస్సి, ఎస్టిలకు ఏ విధమైన రుణాలు ఇవ్వనందుకా? ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నందుకా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకా అంటూ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. అనంతరం టిడిపి మినీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రతి ఇంటికి ఇచ్చి మన కష్టాలు పోవాలంటే చంద్రబాబును సిఎంను చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు గొంప వెంకటరావు, నియోజకవర్గం టిడిపి మహిళా అధ్యక్షులు గుమ్మడి భారతి, ఐటిడిపి అధ్యక్షుడు సేనాపతి గణేష్, నాయకులు జనపరెడ్డి ఈశ్వరరావు, ఎం రామకృష్ణ, సిరికి రమణ, జి రమణ తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/vpd-tdp-2.jpg)