ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్
ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని విఆర్ఎలు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిం చారు. జిల్లా నలుమూలల నుంచి విఆర్ఎలు కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలను పరిష్కరించాలని నినదించారు. ధర్నా అనంతరం కలెక్టర్ కె.మాధవీలతకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, విఆర్ఎ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లిమొగ్గల.వెంకట రమణ, ఎస్కె.రెహ్మాన్ మాట్లాడారు. విఆర్ఎలకు పే స్కేల్ను వర్తింప చేయాలని, నామినీలుగా పని చేస్తున్నవారిని రెగ్యులర్ విఆర్ఎలుగా గుర్తుంచాలని, ఖాళీగా ఉన్న విఆర్ఒ, వాచ్మెన్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్్, జీపు డ్రైవర్ పోస్టులలో 30 శాతం ఉన్న శాతాన్ని 70 శాతానికి పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన 500 డిఎ ను 2018 జూన్ నుంచి వేతనంతో కూడిన డిఏగా తక్షణమే ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డిఎను సైతం జగన్ ప్రభుత్వం ఒక్కొ క్కరి నుంచి రూ.100, 500 రికవరీ చేసి విఆర్ఎల కడుపును కొట్టిందని తెలిపారు. ఎన్నికల ముందు రూ.15 వేలు వేతనం ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ సిఎం అయ్యాక హామీ సంగతిని గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎ సంఘం మాజీ జిల్లా కార్యదర్శి భగత్, సంఘం జిల్లా నాయకులు కె.రాజేంద్రప్రసాద్, ఆర్.సుబ్బారావు, డి. సత్యనారాయణ, కె.ధర్మరాజు, ఎ.బాలయ్య, డి.నాగరాజు, టి.సతీష్, కె.సూర్యచంద్రరావు, ఎం. దుర్గారావు, బి.రాజు, పి.వెంకటరావు, పాల్గొన్నారు.