ప్రజాశక్తి-విజయనగరం : రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని ఈనెల 19న విజయవాడలో ఆవిష్కరిస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఈనెల 9 నుంచి 19 వరకు జిల్లాలో సామాజిక సమతా సంకల్ప మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటల నుంచి అంబేడ్కర్ జీవిత చరిత్రపై ఫోటో ఎగ్జిబిషన్, కవి సమ్మేళనం, వివిధ దళిత సంఘాలతో చర్చా గోష్టి, సాంస్కతిక కార్యక్రమాలు, జీవిత చరిత్రపై లఘుచిత్రం ప్రదర్శన వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. 19న జిల్లా కేంద్రంలో మానవహారం, రక్తదాన శిబిరం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డిఆర్డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి, జెడ్పి సిఇఒ రాజ్కుమార్, మెప్మా పీడీ సుధాకర్, గ్రామ వార్డు సచివాలయాల అధికారి నిర్మలాదేవి, డిఇఒ. లింగేశ్వరరెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి రామానందం, డిపిఒ శ్రీధర్ రాజా, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కెఎల్విఎల్ఎన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.