ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ) : కే.గంగవరం మండలంలోని తాళ్లపోడు గ్రామంలో ఆదివారం ఉదయం కాలేజీ బస్సు దగ్ధమైంది. యానాం సమీపంలోని రవి కాలేజీకి చెందిన ఈ బస్సు ప్రతిరోజు కే గంగవరం మండలంలోని తాళ్లపూడి పరిసర ప్రాంతాల నుండి విద్యార్థులను కళాశాలకు తీసుకువెళుతుంది. ఆదివారం కావడంతో బస్సు యధావిధిగా తాళ్లపూడిలో నిలిపివేశారు. ఇది కొత్త బస్సు కావడంతో బస్సు బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోగా ఎవరికి ఏ విధమైన ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామస్తులే మంటలను అదుపు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసినందుకు స్థానికులను అభినందించారు. ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నారు. సుమారు 15 లక్షల వరకు నష్టం ఉంటుందని అంచనా వేశారు.