బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్
ఆత్మకూరు : ఎన్నికల వేళ సమస్యాత్మక గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, రికార్డులతోపాటు రిసెప్సన్ సెంటర్, లాకప్ గదులను పరిశీలించారు. ఇందులో భాగంగా ఆత్మకూరు పోలీసుస్టేషన్ పరిధిలోని ఫ్యాక్షన్ ప్రభావిత, సమస్యాత్మక గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఆరాతీశారు. గ్రామాల్లో అశాంతి, అలజడులు, సమస్యలకు కారణమయ్యే వారిపై నిరంతర నిఘా వేయాలన్నారు. గట్టిగా పని చేయాలన్నారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటెన్ చేసే ప్రతి రికార్డునూ సమీక్షించారు. కేసులు త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు. దొంగతనాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వివిధ నేరాలలో సీజ్ చేసిన వాహనాలను వెంటనే డిస్పోజల్ చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం పోలీసుస్టేషన్కు వచ్చిన పిటీషనర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మునీర్ ఉన్నారు.