సమావేశంలో మాట్లాడుతున్న శాసనమండలి మాజీ అధ్యక్షులు ఎంఎ షరీఫ్
ప్రజాశక్తి-రాయదుర్గం
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ అధ్యక్షులు ఎంఎ షరీఫ్, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం రాయదుర్గంలోని అజీజి యా షాదీ మహల్లో టిడిపి ముస్లిం మైనారిటీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి షాదీ మహల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ టిడిపి హయాంలో రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లిములకు నామమాత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు. వాటిని కూడా నవరత్నాలకు మళ్లించారని ఆరోపించారు. అంతేగా కుండా మైనారిటీలపై దాడులు, అత్యాచారాలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. తమ పార్టీ సుప్రీంకోర్టులో పోరాటం చేసి నాలుగు శాతం రిజర్వేషన్ సాధనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. టిడిపితోనే సమ సమాజ స్థాపనకు సాధ్యమన్నారు. తాము రూపొందించే కరపత్రాలను ప్రతి మసీదు, ప్రతి ముస్లిం ఇంటికీ చేర్చాలని కోరారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్, ప్రస్తుత వైసిపిలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నాయన్నారు. రాజకీయంగా వారిని ఎదగనివ్వలేదన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రంలో మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు గౌస్ మొహద్దీన్, టిడిపి రాష్ట్ర పరిశీలకులు పర్వీన్తాజ్, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్బాషా,. టిడిపి మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు సాలార్ బాషా, విశ్రాంత ఎస్పీ షేక్షావలి, మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మహబూబ్బాషా, టిడిపి నాయకులు సనావుల్లా, ఉస్మాన్, జమీల్ఖాన్, జిలాన్, టిడిపి పట్టణ అధ్యక్షుడు నాగరాజు ప్రధాన కార్యదర్శి ఇనాయత్ బాషా, మున్సిపల్ వార్డు సభ్యులు ప్రశాంతి, జ్యోతి, మాజీ సభ్యులు భారతి, తదితరులు పాల్గొన్నారు.