మాట్లాడుతున్న యుటిఎఫ్ జిల్లా కోశాధికారి రాఘవేంద్ర
ప్రజాశక్తి-గుంతకల్లు
మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యుటిఎఫ్ జిల్లా కోశాధికారి రాఘవేంద్ర డిమాండ్ చేశారు. ఈమేరకు యుటిఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మండల రీసోర్స్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లను చేపట్టాలన్నారు. అదేవిధంగా జీపిఎఫ్ అకౌంట్లను తెరవాలని డిమాండ్ చేశారు. గుంతకల్లు అర్బన్ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, రాజ్కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యలు, మున్సిపల్ పాఠశాలల్లో అప్డేట్ కాకుండా మిగిలిపోయిన పోస్టులను అప్డేట్ చేయాలని, బోధనేతర సిబ్బందిని నియమించాలని, పాఠశాలల కరెంటు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఈనెల 15న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అయినా స్పందించకుంటే 30న విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ అర్బన్ శాఖ నాయకులు మల్లికార్జున, శంకరయ్య, సిద్ధయ్య, సుధాకర్, యల్లన్న, రఫీ, రమేష్, ఖలీల్, వెంకటేష్, పెన్నయ్య, రూరల్ శాఖ ప్రధాన కార్యదర్శి కల్పన, మహిళా నాయకులు లావణ్య, యాస్మిన్, ఫసీహ తహసీన్, రెహనా, తదితరులు పాల్గొన్నారు.