సభలో మాట్లాడుతున్న సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎంఎ.బేబి

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకుందాం

       అనంతపురం ప్రతినిధి : దేశంలో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవడం ఎంతో ఆవశ్యమని సిపిఎం, సిపిఐ జాతీయ నాయకులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక నాయకుల విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ప్రజల ఎజెండా- ఎన్నికల అజెండా కావాలి’ అన్న పేరుతో ప్రాంతీయ సభను నిర్వహించారు. అనంతపురం నగరంలోని చలమారెడ్డి ఫంక్షన్‌ హాలులో జరిగిన ఈ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభలో అనంతపురం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వి.మల్లికార్జున, అనంతపురం అసెంబ్లీ సిపిఐ అభ్యర్థి జాఫర్‌, రాప్తాడు కాంగ్రెస్‌ అభ్యర్థి శంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎ.బేబి మాట్లాడుతూ మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఎన్నికల సంఘాన్ని కూడా తమ చెప్పుచేతుల్లో పెట్టుకునే విధంగా నియామకంలో మార్పులు తీసుకొచ్చారని విమర్శించారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రదానమంత్రి, సీనియర్‌ మంత్రి, ప్రతిపక్షనాయకుడు ఒకరు కలిపి నియమిస్తారన్నారు. ఇందులో మెజార్టీ సభ్యులు అధికారపార్టీకి సంబంధించిన వారే ఉండటంతో వారనుకున్న వారినే నియమించడం జరుగుతందన్నారు. తద్వారా తమకు అనుకూలంగానున్న వారినే ఎన్నికల అధికారులుగా నియమించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు ఎన్నిక సంఘం నామమాత్రమే అవుతోందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవలి రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో మత విధ్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా చర్యలేవని విచారం వ్యక్తం చేశారు. ప్రసంగాలు చేసిన ప్రధానమంత్రిని కాదని, పార్టీ అధ్యక్షుడికి తాఖీదులిచ్చి వదిలేసిందని తెలిపారు. మీడియా మొదలుకుని అన్ని రాజ్యాంగ వ్యవస్థలను మోడీ తమ నియంత్రణలో పెట్టుకుంటున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించడం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం లాంటిదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ టిడిపి, వైసిపిలు బిజెపికి అనుకూలంగా మారాయని విమర్శించారు. ఈ ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసిపి మూడు రాజధానులంటే ఏదీ లేకుండా చేసిందని పేర్కొన్నారు. బిజెపికి అనుకూలంగానున్న ఈ రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా మాట్లాడుతూ మతత్వాన్ని రెచ్చగొట్టి బిజెపి మరోమారు అధికారంలోకి వచ్చేందుకు చూస్తోందన్నారు. ఎన్నికల ప్రచారాల్లోనూ మోది మతాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా బిజెపి పాలనలో పేదలను కొట్టి పెద్దలకు పంచిపెట్టారని విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్లు దోచిపెట్టారని దుయ్యబట్టారు. రూ.4800 కోట్లు కేవలం ఆయన ప్రచారం కోసమే ప్రజాధనాన్ని వినియోగించారని తెలిపారు. మీడియా మొత్తం కొనుగోలు చేయడమే.. నియంత్రించడమో చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి రెండు విడతల్లోనే జరిగిన ఎన్నికల తీరు చూస్తుంటే బిజెపికి ఓటమి తప్పదన్నది స్పష్టమవుతోందని చెప్పారు. దేశంలోనున్నది ఎన్డీయే దానికి వ్యతిరేకంగా ఇండియా వేదికనే అని చెప్పారు. ఇండియా వేదిక సభ్యులను ఓటు వేసి ఈ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ రాజ్యాంగం పరిరక్షించబడాలంటే ఇండియా వేదిక సభ్యులను గెలిపించుకోవాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మోడీ ఈ పదేళ్ల పాలనలో ఎక్కడలేని విధంగా నిరోద్యగం పెరిగిందన్నారు. 65 శాతానికి నిరుద్యోగం చేరిందని చెప్పారు. పది పోస్టులకు లక్ష మంది పోటీ పడే పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. అధికారంలోకి రాకముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్నది మరచిపోయారని పేర్కొన్నారు. మతాన్ని రెచ్చగొడ్డటం.. సంపదను కార్పొరేట్లకు పంచిపెట్టుడమే మోడీ పదేళ్ల పాలన సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వి,మల్లికార్జున, అనంతపురం అసెంబ్లీ సిపిఐ అబ్యర్థి జాఫర్‌, రాప్తాడు కాంగ్రెస్‌ అభ్యర్థి శంకర్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సావిత్రి, బాలరంగయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️