ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, సిపిఎంన నాయకులు
ప్రజాశక్తి-వజ్రకరూరు
ఎన్డిఎ కూటమి అభ్యర్థులను ఓడించడంతోపాటు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని వజ్రకరూరు సిపిఎం మండల కన్వీనర్ విరూపాక్షి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్రెడ్డి సతీమణి సుభద్రాదేవి పిలుపు నిచ్చారు. గురువారం వజ్రకరూరు మండల పరిధిలోని ధర్మపురి గ్రామంలో సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా గత పదేళ్లలో బిజెపి చేసిన అరాచకాలు, మత విద్వేషాలను ప్రజలకు వివరించడంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అవలంభించే విధానాలను రాష్ట్రంలో కూడా వైసిపి, టిడిపిలు అనుసరిస్తున్నాయన్నారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దర్శనారెడ్డి, సిపిఎం నాయకులు సుధాకర్, రంగమ్మ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.