సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ.బేబికి స్వాగతం పలుకుతున్న జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్
అనంతపురం కలెక్టరేట్ : సాధారణ ఎన్నికలు -2024 సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో నేడు ప్రాంతీయ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సిపిఎం పని చేస్తోందన్నారు. ప్రజల అజెండానే – ఎన్నికల అజెండా కావాలని కోరుతూ సిపిఎం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు అనంతపురం నగరంలోని గుత్తిరోడ్ ద్వారకా చలమారెడ్డి ఫంక్షన్ హాల్లో సిపిఎం ప్రాతీయ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు కేరళ రాష్ట్రం మాజీ మంత్రి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి, సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ బాషా, మాజీ మంత్రి ఎఐసిసి కార్యవర్గ సభ్యులు ఎన్.రఘువీరారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి వారితో పాటు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇండియా వేదిక అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపొందాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో లౌకికతత్వాన్ని కాపాడాలంటే ఇండియా వేదిక అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, బుందెల్ ఖండ్ తరహా ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి, రాజధాని నిర్మాణానికి నిధులు, ఉపాధి కల్పనకు పరిశ్రమలు, జాతీయ సంస్థల రక్షణ తదితర వాటి కోసం ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. జిల్లాలోని సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రాంతీయ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు.