ప్రజాశక్తి-కంభం(ప్రకాశం) :సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. కంభంలోని కందులాపురం సెంటర్లో కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు నిరనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా సిఐటియు, ఎఐటియుసి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు ఇచ్చిన హామీ ప్రకారమే మేము అడుగుతున్నామన్నారు. 12 రోజుల నుండి ఇల్లు, పిల్లలను వదిలేసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్ని మా జీతాలను పెంచమని అడుగుతున్నా వాటిని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కంభం మండల సిఐటియు కన్వీనర్ అన్వర్ భాష , సిఐటియు నాయకులు దానం, వెంకట్, ఏఐటీయూసీ నాయకులు షేక్ ఇబ్రహీం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.