ప్రజాశక్తి – రెంటచింతల : సమస్యాత్మక నియోజకవర్గమైన మాచర్ల పరిధిలోని రెంటచింతలలో పోలింగ్కు ముందురోజైన ఆదివారమే ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లో ఆయా పార్టీల తరుపున కూర్చునే ఏజెంట్ల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వివాదం వచ్చింది. ఇదికాస్త సాయంత్రానికి ఘర్షణకు దారితీసింది. టిడిపికి చెందిన వారు వైసిపి వారిపై కర్రలతో దాడి చేశారు. దాడిలో మోర్తుల ఉమామహేశ్వర్రెడ్డి, పొట్లూరి వెంకట్రెడ్డి గాయపడ్డారు. దాడిలో రెండు కార్లు సైతం ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న కారంపూడి సిఐ నారాయణస్వామి అక్కడికి చేరుకుని ఇరు పక్షాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటచింతలకు వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం వారిరి చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. దీనిపై ఇరుపక్షాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి.