ప్రజాశక్తి – కొమరాడ : ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం పరశురాంపురంలో ఉపాధిహామీ వేతనదారులకు వేసవి దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించి అవగాహన కల్పించారు. బయట ఉష్ణోగ్రతలు కారణంగా శరీరం ఎక్కువ నీరు, లవణాలను కోల్పోతుందని, వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని, నీరు, నిమ్మరసం, మజ్జిగ, ఒఆర్ఎస్, కొబ్బరినీళ్లు, ఇంకా ఇంటి వద్ధ అందుబాటులో ఉన్న ద్రావణాలు తాగుతూ ఉండాలన్నారు. పనుల నిమిత్తం ఉదయం ఇంటి దగ్గర బయల్దేరే ముందు తప్పని సరిగా ద్రవరూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, తాగు నీరు వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఒఆర్ఎస్ ప్యాకెట్లు వైద్య సిబ్బంది వద్ద గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఒఆర్ఎస్ ప్యాకెట్ను నీటిలో కలిపే విధానాన్ని అక్కడ వైద్య సిబ్బందిచే చేసి చూపించి, అక్కడ ప్రజలకు ఒఆర్ఎస్ ద్రావణాన్ని తాగించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ వడదెబ్బకు గురయ్యే సమయంలో తలనొప్పి, తలతిరగడం, వికారం, జ్వరం, స్పృహ కోల్పోవడం, అపస్మారక స్థితి మొదలగు లక్షణాలు ఉంటాయని వివరిస్తూ, ప్రాథమికంగా వెంటనే చేపట్టాల్సిన చర్యలను ఒక డెమో రూపంలో చేయించి, ప్రదర్శించి అందరికీ అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఇంకా అపస్మారక స్థితిలో ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రానికి, ఆసుపత్రికి తరలించాలన్నారు. గ్రామాల్లో ఒఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఆరోగ్య పరిశీలన చేశారు. పిల్లలకు తరచుగా నీరు తాగించాలని ఎవరికైనా జ్వరం అనిపిస్తే వెంటనే తెలియజేయాలన్నారు.డ్రైడే కార్యక్రమంగ్రామంలో వైద్య సిబ్బంది నిర్వహించిన డ్రైడే కార్యక్రమాన్ని డిఎంఒ పరిశీలించారు. దోమలు వృద్ధి చెందే ప్రదేశాలు గుర్తించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. జ్వర లక్షణాలున్న వారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకున్నారు. జ్వర నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, పిహెచ్ఎన్ విజయకుమారి, వైద్య సిబ్బంది రామకృష్ణ, లత, ప్రమీల, ఉపాధిహామీ సిబ్బంది ఎల్లయ్య,జ ో్యతి, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/dio.jpg)