యూనియన్ గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్ ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్: 42 రోజులుగా పోరాటం చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన మినిట్స్ ప్రకారం సమస్యలను పరిష్కారానికి వెంటనే జీవోలు విడుదల చేయాలని యూనియన్ గౌరవాధ్యక్షుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. బుధవారం నగిరిలో జరిగిన అంగన్వాడి ప్రాజెక్టు సమావేశంకు ధనకోటి అధ్యక్షతన వహించారు. ఈసందర్భంగా గంగరాజు మాట్లాడుతూ అంగన్వాడీల చారిత్రకమైన సమ్మె పోరాటం చేసి అంగన్వాడిలకు అభినందనలు తెలిపారు. పోరాటంతో వందశాతం ఉద్యోగులు ఒక తాటిపైకి వచ్చి ఐక్యంగా ఈ సమ్మెను జయప్రదం చేశారన్నారు. రాష్ట్రంలో కార్మికవర్గానికి మంచి స్ఫూర్తిని కలిగించారని కొనియాడారు. అంగన్వాడీ ఉద్యోగులందరికీ సిఐటియు తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సమ్మె అనుభవాల్ని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నామన్నారు. సమ్మె సందర్భంగా అంగీకరించిన ఒప్పందం సంబందించి అంశాలు వెంటనే జీవో ఇవ్వాలని, 42 రోజులు సమ్మె కాలం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రాజెక్టు గౌరవాధ్యక్షురాలుగా పంచవర్ణ, అధ్యక్షురాలుగా షీలా, కార్యదర్శిగా ధనకోటి, కోశాధికారిగా వనిత, ఉపాధ్యక్షురాలుగా మైధిలి, వరలక్ష్మి, సహాయకార్యదర్శులుగా షర్మిల, అరుణలతో పాటు 10 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.