పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు

Dec 19,2023 21:34

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: పెనుమూరు పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ వై.రిశాంత్‌ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కి విచ్చేసిన ఎస్పీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు స్టేషన్‌ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసుస్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసు డెయిరీ, విలేజ్‌ రోస్టర్‌, వివిధ క్రైమ్‌ రికార్డులను పరిశీలించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని, డ్రంకన్‌ డ్రైవ్‌, రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్‌ ఎగైనెస్ట్‌ ఉమన్‌, గర్ల్‌ మిస్సింగ్‌, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, తదితర కేసుల రికార్డ్స్‌ను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో పెండింగ్‌ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై కేసుల ఫైల్స్‌ను పరిశీలించి నిందితులు అరెస్ట్‌ కాని కేసులలో నిందితులను త్వరగా అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. అలాగే సమన్లు, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్‌ స్టేషన్‌ అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్‌ కేసులను సమీక్షించారు. పోలీస్‌స్టేషన్లో నమోదైన కేసుల్లో వత్తి నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి త్వరితగతిన విచారణ పూర్తిచేసి, నిర్దేశిత కాలవ్యవధిలో కోర్ట్‌లో ఛార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేసి, సమర్థవంతమైన ట్రయిల్‌ ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని సూచించారు. సివిల్‌, భూతగాదాలు, పాత గొడవల్లోని, అనుమానం ఉన్న వ్యక్తులను గుర్తించి బైండోవర్‌ చెయ్యాలని సూచించారు. అదే విధంగా పోలీసు స్టేషన్‌ పరిధిలో గల స్కూల్స్‌ వద్ద, హోటల్స్‌ లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిబుల్‌ పోలీసింగ్‌ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల అడ్డుకట్టకు నైట్‌ బీట్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. గ్రామ/వార్డు సచివాలయాల పోలీసులు ఇంటింటికి వెళ్లి మహిళలపై జరుగుతున్న నేరాలు, మ్యాట్రిమోనియల్‌ ఇష్యూస్‌పై దష్టిపెట్టాలని, అంతేకాకుండా సైబర్‌ నేరాలు, ముఖ్యంగా లోన్‌ యాప్‌ల మోసాలు, గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌, ఫోక్సో నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. పోలీసుస్టేషన్‌ సిబ్బందికి సంబంధించిన సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి డిపిఓలో పెండింగ్‌ సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేస్తానని సిబ్బందికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు ఎస్‌డిపిఓ శ్రీనివాస మూర్తి, ట్రైనీ డీఎస్పీ పావన్‌ కుమార్‌, ఈస్ట్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ గంగి రెడ్డి, పెనుమూరు ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌, స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️