ప్రజాశక్తి- కుప్పం : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె గురువారానికి మూడో రోజుకు చేరింది. కుప్పం మున్సిపాలిటీలో మూడవరోజు మున్సిపల్ కార్మికులు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయడంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడాని తీవ్రంగా ఖండించారు. పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మున్సిపల్ కార్మికులను ఏమాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. ఓ పక్క అంగన్వాడీలు 17 రోజులకు సమ్మె చేస్తుంటే సచివాలయాల ఉద్యోగుల దగ్గర బలవంతంగా సెంటర్ తాళాలు పగలగొట్టించి ప్రభుత్వం పనులు చేపట్టిందని, మున్సిపల్ కార్మికుల సమ్మె చేస్తున్నారు మరి ఇప్పుడు సచివాలయాల కార్మికుల చేత రోడ్లు, ఊడ్చే పని కాలువల్లో పూడికలు తీసే పని చేయించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఎవరు పనిపై వారు నైపుణ్యం కలిగి ఉంటారని కార్మికులు ఉద్యోగుల మధ్య చిచ్చిపెట్టే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలుచేసి ఉద్యోగులకు సిపిఎస్ రద్దుచేసి సమ్మెను విరమింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు పార్థబన్, గోవిందరాజులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/municipal-karmikulu.jpg)