రేపు జిఎస్‌ఎల్వి ఎఫ్‌ 14 ప్రయోగానికి సిద్ధం…

Feb 15,2024 21:46
రేపు జిఎస్‌ఎల్వి ఎఫ్‌ 14 ప్రయోగానికి సిద్ధం...

ప్రజాశక్తి-సూళ్లూరుపేట: శ్రీహరికోట నుంచి ఈనెల 17న శనివారం సాయంత్రం 5.30 గంటలకు జి ఎస్‌ ఎల్‌ వి 14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ రాకెట్‌ ద్వారా భారత వాతావరణ ఉపగ్రహం ఇన్‌ శాట్‌ 3డిఎస్‌ ను ప్రయోగిస్తున్నారు. షార్‌ లోని రెండవ వేదిక వద్ద ఇప్పటికే రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి తుది ఏర్పాట్లు జోరందుకున్నాయి .ఇస్రో కీర్తి కిరీటంలో ఈ ఉపగ్రహం మరో కీలకమైన ప్రయోగంగా భావిస్తున్నారు. ఇప్పటికే పలు ఇన్సాట్‌ తరహా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి ఉంది. ఎప్పటికప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు గమనించి భూ కేంద్రాలకు ఖచ్చితమైన సమాచారం అందించడానికి కేంద్రం ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ శాఖ కోసం ఈ ప్రయోగాన్ని జరుపుతున్నారు. వాతావరణ సంబంధమైన అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగిస్తున్న ఈ ఉపగ్రహం బరువు 2275 కేజీలుగా ఉంది. పీఎస్‌ఎల్వీ రాకెట్‌ ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జిఎస్‌ఎల్వీని మూడు దశలోనే ప్రయోగించనున్నారు. 51.7 మీటర్ల పొడవైన జి ఎస్‌ ఎల్‌ వి ఎఫ్‌ 14 రాకెట్‌ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి బయలుదేరుతుంది. వాతావరణం అంచనాలు, విపత్తులను ముందుగా హెచ్చరించడానికి ఇది ఉపయోగపడుతుంది. జి ఎస్‌ ఎల్‌ వి మార్కు2 సిరీస్‌ లో ఇది 16వ ప్రయోగం కావడం విశేషం.

➡️