ప్రజాశక్తి – మంగళగిరి రూరల్ : ఇండియా బ్లాక్ బలపరిచిన సిపిఎం మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జొన్న శివశంకరరావు, గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ మండలంలోని ఆత్మకూరులో ఆదివారం రోడ్షో నిర్వహించారు. డప్పుల మోత, కార్యకర్తల నినాదాల నడుమ సాగిన ప్రదర్శనకు వామపక్ష అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు, మాజీ వైస్ ఎంపిపి మొసలి పకీరయ్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడారు. మంగళగిరి ప్రాంతంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఒక కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని, ఈ ప్రాంతంలో పేదల కోసం అనేక పోరాటాలు చేశామని, వాటిని పరిష్కరించిన చరిత్రా కమ్యూనిస్టు పార్టీలకు ఉందని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా ప్రజా సమస్యలను అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రజావాణి వినిపించే అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో జతకట్టిన టిడిపి, జనసేన కూటమికి, పరోక్షంగా బిజెపికి మద్దతిస్తున్న వైసిపి పార్టీకి ఓటు వేస్తే అది బిజెపికి వేసినట్లే అవుతుందని అన్నారు. డబ్బు సంచులతో వచ్చి ఓట్లు కొని గెలవాలనుకునే పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఎంపీ అభ్యర్థి జంగాల అజరు కుమార్ మాట్లాడుతూ ధరలు ఆకాశాన్నంటి సామాన్యులు బతకలేని పరిస్థితులు వచ్చాయని అన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండే ప్రజల మధ్య కేంద్రంలోని బిజెపి మతచిచ్చు పెడుతోందని, మణిపూర్లో జాతులు మధ్య అల్లర్లు సృష్టించిందని మండిపడ్డారు. రాజ్యాంగానికి తూట్లు పొడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి, రాజధాని నిర్మాణానికి నిధులిస్తామని చెప్పిన ప్రధాని మోడీ మట్టి, నీళ్లు ముఖాన కొట్టి వెళ్లారని, చివరికి రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. మరోవైపు జగన్మోహన్రెడ్డి మూడురాజధానుల పల్లవి అందుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుకాక దగా పడ్డ ఆంధ్రులంతా మెల్కొని ఎన్డిఎ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి మరోసారి గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు అనేవి ఉండవని, రాచరిక వ్యవస్థ, మనువాద వ్యవస్థ రాజ్యమేలుతుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ ఆత్మకూరులో అనేక పోరాటాల ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు సాధించి పెట్టిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. గ్రామంలో వివిధ పోరంబోకు స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న పేదలందరికీ ఇండియా వేదిక అధికారానికి వచ్చిన తర్వాత ఇంటి పట్టాల సమస్యను, శ్మశానాల సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. బలవంతంగా నెట్టబడిన కార్పొరేషన్ పరిధిలోని ఇంటిపన్ను, చెత్తపన్ను భారాలను తగ్గిస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, సిపిఐ నియోజకవర్గ నాయకులు చిన్ని తిరుపతయ్య, సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శులు ముసలి జ్యోతిబసు, జాలాది జానుబాబు, స్థానిక నాయకులు యు.దుర్గారావు, కె.ఈశ్వరరావు, జి.అజరుకుమార్, సిహెచ్.జనార్ధనరావు, డి.పద్మనాభశర్మ, పి.మరియదాసు, బి.రాంబాబు, కె.ఆంజనేయులు, జి.కృష్ణారావు, ఆనందం బాబ్జి, వి.సురేష్, ఎం.సంధ్య, లక్ష్మి, శకుంతల, శిరీష, యు.అమల కుమారి, పూర్ణిమ, హేమలత, జె.జ్యోతి, నాగలక్ష్మి పాల్గొన్నారుజొన్నా శివశంకరరావు, జంగాల అజరు కుమార్ను గెలిపించాలని కోరుతూ మండలంలోని కాజ, చినకాకానిలో ఇంటింటి ప్రచారం చేశారు. సిపిఎం, సిపిఐ కాంగ్రెస్ కార్యకర్తలు ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఇ.అప్పారావు, బి.కోటేశ్వరి, కె.నాగేశ్వరరావు, సత్యమారెడ్డి, గోపాలరెడ్డి, శివయ్య, జి.బాబువరప్రసాద్, వి.పూర్ణయ్య, కె.శంకరరావు, టి.బ్రహ్మం, సిపిఐ నాయకులు వై.వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు అప్పారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మంగళగిరి : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేవారిని ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం సీనియర్ నాయకులు పి.బాలకృష్ణ కోరారు. పట్టణంలోని పాత మంగళగిరి, ఇప్పటం రోడ్లో సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావును, ఎంపీ అభ్యర్థి జంగాల అజరు కుమార్ను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం చేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్, నాయకులు ఎం.చలపతిరావు, వి.విజయలక్ష్మి, ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఏడుకొండలు, టి.హేమసుం దర్రావు, ఎం.కిరణ్, సమీర్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : ఇండియా వేదిక బలపరిచిన మంగళగిరి సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు పార్లమెంట్ సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఉండవల్లి అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జి.రవి, వి.వెంకటేశ్వరరావు, ఎస్.ఇమ్మానుయేలురాజు, శేషయ్య, డి.కోటేశ్వరరావు, సూరిబాబు, ఒ.రమేష్, రాము, కుమార్, ఎం.రమేష్, తిరుపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి- తాడికొండ : నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో జంగాల అజరుకుమార్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. మోడీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ఒక్క రూపాయి నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేదని, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల హామీని విస్మరించారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని విమర్శించారు. అవినీతిపరులను అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. మతోన్మాద బిజెపితో టిడిపి, జనసేన, వైసిపి కుమ్మక్కయ్యాయని దుయ్యపట్టారు. వివిధ సామాజిక తరగతులు, మతాల వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, ఈ విధ్వేష రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో సిపిఐ, సిపిఎం నాయకులు కెవివి ప్రసాద్, కె.ఈశ్వరరావు, జె.చైతన్య, సిహెచ్.భాస్కరరావు, కె.పూర్ణచంద్రరావు, బి.భద్రయ్య, జోజి, ప్రసాద్, సత్యనారాయణ, ఎం.హనుమంతరావు, ఎ.అరుణ్ కుమార్, రామకృష్ణ, విజరు, శివశంకర్రావు, సత్యానందం, దేవునిదయ, చెన్నకేశవులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-05-at-15.01.12-1.jpg)