తాగునీటి కోసం మాదలవారిగూడెంవాసుల ఆందోళన

Apr 28,2024 15:21 #Concern, #drinking water, #residents

ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా) : మాదలవారిగూడెం కొండగట్టు చుట్టూ ఉన్న నివాసితులకు తాగునీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని, రోజులో రెండు సార్లు కుళాయిలకు నీరు వదలాలని, కొండగట్టు పైకి నీరు ఎక్కేలా చూడాలని జనాలు నినాదాలు చేశారు. సిపిఎం మండల నాయకులు బెజవాడ తాతాబ్బాయి మాట్లాడుతూ … వేసవి ఎండలు తీవ్రంగా ఉండటంతో కొండగట్టు చుట్టూ ఉన్న జనాలకు తాగునీరు అందడం లేదన్నారు. కుళాయిల్లో సక్రమంగా నీరు రాకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మంచినీరు కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్పారు. పంచాయతీ అధికారులను అడిగినా, ప్రజా ప్రతినిధులను అడిగినా పట్టించుకోవడంలేదని, నేటి సమస్య రోజురోజుకు పెరుగుతుందని తెలిపారు. నీటి కోసం మహిళలు పడుతున్న బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయితీ పాలకవర్గం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించాలని, కుళాయిలకు మీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేసవిలో ప్రజలను నీటి కోసం ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. మండల స్థాయి అధికారులు దీనిపై పరిశీలన చేయాలన్నారు.

➡️