ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఇండియా బ్లాక్ పార్టీల బహిరంగ సభ స్థానిక మల్లయ్య లింగం భవన్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి గురువారం తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలు, ఆప్, ప్రజాతంత్ర శక్తులు పర్చిన సిపిఐ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి జంగాల అజరుకుమార్ని గెలిపించాలని కోరుతూ బిఆర్ స్టేడియం నుంచి ర్యాలీ, అనంతరం బహిరంగ సభ ఉంటాయని తెలిపారు. సభకు డిసిసి అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథుతులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రసంగిస్తారని తెలిపారు.