- ఏపీ మున్సిపల్ వర్కర్స్ డ ఎంప్లాయిస్ ఫెడరేషన్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వంతో నిన్న జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, సమ్మె కొనసాగుతుందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్మోహన్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో సిఐటియు నగర కార్యదర్శి బి.రమణ, యూనియన్ కార్యదర్శి భాస్కర్రావుతో కలిసి జనవరి 8న కలెక్టరేట్ ముట్టడి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న 15వేల జీతం, 6000 కలిపి 21000/-జీతంగా ఇస్తామని చర్చల్లో చెప్పిందని, దీనివల్ల కార్మికులకి పెద్దగా జరిగే ప్రయోజనం లేదని జీతంతో కలిపి అదనంగా హెల్త్ అలవెన్సు కొనసాగించాలని డిమాండ్ చేశారు. వాటర్ వర్క్స్, పంప్ హౌస్, ప్లాంటేషన్ తదితర కార్మికుల సమస్యలపై నిర్దిష్టమైన చర్చ జరగలేదని, పర్మినెంట్ కార్మికులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్ డబ్బులు, సిపిఎస్ రద్దు స్పష్టత లేదన్నారు. అందుకని సమ్మె కొనసాగుతుంది అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు శంకర్రావు, రామారావు, శ్రీను, సూరి, రాఘవ, చిన్ని, మజ్ను, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.