తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా
ప్రజాశక్తి – యంత్రాంగం
అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై ఆశావర్కర్లు నిరసన తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వారు విధులను బహిష్కరించారు. తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. రాజమమేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఎపి ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి ఎం.వెంకటలక్ష్మి మాట్లాడుతూ ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ఒకరోజు ముందే సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ఆశా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారన్నారు. అర్ధరాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, రాజకీయ, అధికార వేధింపులు ఆపాలిన డిమాండ్లతో శాంతియుత ఆందోళనకు దిగామన్నారు. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతించడం లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మహిళలని కూడా చూడకుండా మెన్ ఫోర్స్ ద్వారా నిర్బంధాన్ని ప్రయోగించారన్నారు. మహిళా సాధికారత అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రజానీకానికి ప్రాణాలకు తెగించి సేవలు చేసినందుకు జగన్ ప్రభుత్వం పోలీసులతో చేసిన సత్కారానికి రాబోయే ఎన్నికల్లో రుణం తీర్చుకుంటామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలన్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధర్నాకు మద్దతు తెలిపారు. ఆశాలపై నిర్బందాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హాజరై మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి ఆశ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు దుర్గ, హవేలా మంగ, సత్య, కమల, సునీత, జయ, రమలక్ష్మి, సునీత, అరుణ తదితరులు పాల్గొన్నారు. కడియంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆశాలు ధర్నా నిర్వహించారు. తొలుత దేవిచౌక్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు టి.నాగమణి, సెక్రటరీ పి.పద్మ, జాయింట్ సెక్రటరీ వి.లక్ష్మి, ఎస్.ముత్యవేణి, డి సత్యవతి తదితరులు పాల్గొన్నారు దేవరపల్లి మండలం యాదవోలు పిహెచ్సి వద్ద ఆశాలు ధర్నా నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి ఎస్.భగత్ మాట్లాడారు. ఆశ వర్కర్ల పట్ల దుర్మార్గ వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయటం అవివేకం అన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు కె.బుజ్జమ్మ, టి.భారతి, ఎ.ద్రాక్షాయణి, టి.సరోజిని, పి.ఝాన్సీ పాల్గొన్నారు. చాగల్లు పిహెచ్సి వద్ద ఆశా వర్కర్లు ర్నా నిర్వహించారు. వి.కస్తూరి, టి.లక్ష్మి, జె.లక్ష్మీదుర్గ, ఎ.మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. పెరవలి మండలం కానూరు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆశా కార్యకర్తలు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. యూనియన్ గౌర అధ్యక్షులు జువ్వల రాంబాబు ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎ.ద్వారక, ఎ.సుమతి, కె.బేబి, దుర్గాభవాని, ఆశాలు పాల్గొన్నారు.