ప్రజాశక్తి -గోకవరం : మండల కేంద్రమైన గోకవరం తాసిల్దార్ కార్యాలయం సమీపంలో అంగన్వాడీల అపరిస్కృత సమస్యలపై నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెఆ దివారానికి 20వ రోజులకు చేరింది. ఈ సమ్మెలో సుమారు 150 మంది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత 20 రోజులుగా అంగనవాడి సమస్యలపై సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందనలేదని ఆర్థికపరమైన జీతాల సమస్యను, గ్రాడ్యుటి సమస్యను తీర్చకుండా తూతూ మంత్రంగా చర్చలు జరిపి, నిరంకుశ ధోరణిగా వ్యవహరిస్తుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మేము అడుగుతున్నాం తప్ప ఆదనంగా మాకు ఏమీ ఇవ్వమని అడగడం లేదని తెలిపారు. పాదయాత్ర చేసేటప్పుడు అంగన్వాడి అక్క చెల్లెమ్మలు గుర్తున్నారని, అధికారం వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలు గుర్తుకు రావడం లేదని ఆరోపించారు. సీఎం జగన్ మాకు ఇస్తానన్న హామీలు ఇచ్చే వరకు ఈ సమ్మె ఆపేది లేదని తెలిపారు. ఈ సమ్మెను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉద్రిక్తత చేస్తామన్నారు. ఒక్క వైసీపీ ప్రభుత్వం తప్ప అన్నిరాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మాకు మద్దతుగా నిలిచాయని వారు తెలిపారు. రాబోయే కాలంలో అంగన్వాడీల సత్తా ఏంటో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.