ప్రజాశక్తి – ఉండ్రాజవరం : అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడంతో కేంద్రాల నిర్వహణకు అద్దెకిచ్చిన ఇంటి యజమానులు ఖాళీ చేసేయమని హెచ్చరికలు చేస్తున్నారని పలువురు అంగన్వాడి టీచర్లు, ఆయాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె విరమణ అనంతరం మరల అద్దె భవనాల కోసం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క ఉద్యోగం పేరుతో సంక్షేమ పథకాలు ఏవీ అందకపోవడంతో తమ జీవనం కొనసాగించేదెలా అని అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చెవిలో పువ్వులు ధరించి, పెరవలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు ఆధ్వర్యంలో గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. ఇదిలా ఉండగా అంగన్వాడీల సమ్మెకు ఉండ్రాజవరం మండల ఆశాలు, ఏపీటీఎఫ్ నాయకులు శిబిరానికి చేరుకొని, సమ్మెకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కె లక్ష్మి కుమారి, ఎస్ రoగ నాయకమ్మ, ఎం జానకి, కె.ఎన్.ఎస్ ప్రసన్నకుమారి, కె విజయకుమారి, పుల్లరత్నం తదితరులు పాల్గొన్నారు.