సమర్థ పాలన అందించే సత్తా చంద్రబాబుకే ఉంది

May 2,2024 14:53 #kp saradhi
  • రావిచర్ల ఎన్నికల ప్రచారంలో కొలుసు పార్థసారధి
    నూజివీడు : నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ నుంచి జనసేన, బిజెపి కూటమి బలపర్చిన టిడిపి అభ్యర్థి కొలుసు పార్థసారధి తన ఎన్నికల ప్రచారాన్ని గురువారంనాడు నూజివీడు మండలంలోని రావిచర్ల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొలుసు పార్థసారధి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలన అసమర్థంగా సాగిందన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకు పరిపాలనలో అపారమైన అనుభవం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి తరపున టిడిపి అధికారాన్ని కైవసం చేసుకోవటం ఖాయమన్నారు. అన్ని తరగతుల ప్రజల సంక్షేమానికి టిడిపి-జనసేన-బిజెపి కూటమి అధికారంలోకి రాగానే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తనను నూజివీడు శాసనసభ్యుడిగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమానికి నిరంతరం ప్రాధాన్యత ఇస్తానన్నారు. గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని రాబోయేకాలంలో చేసి చూపిస్తానన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తానని వివరించారు. మామిడి, దాని అనుబంధ పరిశ్రమలను ఏర్పాటుచేయటం ద్వారా మామిడి రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటానన్నారు. నూజివీడు నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీఇచ్చారు. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లోని అన్ని ప్రాంతాలను సమానస్థాయిలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటానని వివరించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల పెంపుదలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. మహిళలకు పలు సంక్షేమ పథకాలు అందేలా తన వంతుగా కృషిచేస్తానని కొలుసు పార్థసారధి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ః
➡️