ప్రజాశక్తి-కురుపాం : వేలిముద్ర వేయించి.. స్లిప్పు ఇచ్చి రేషన్ ఇవ్వని ఘటన కురుపాంలోని ఉదయపురం పంచాయతీలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై రేషన్కార్డుదారులు మాట్లాడుతూ.. పంచాయతీ పరిధిలోని కొత్తగూడ, సంజువాయి, రెల్లిగూడ, కంటుగూడ, మల్లి గూడ, కాకితాడ, జాకిరిగూడ, మట్టిగూడ తదితర గ్రామాల్లో 410 రేషన్ కార్డుల లబ్ధిదారులకు మార్చి నెలలో వేలిముద్ర వేయించి.. స్లిప్పులు ఇచ్చి రేషన్ ఇవ్వలేదన్నారు. మళ్లీ ఇప్పుడు ఏప్రిల్ నెల బయోమెట్రిక్ కోసం వచ్చారని తెలిపారు. గతంలో ఆఫ్లైన్లో ఉండేటప్పుడు కూడా సగం బియ్యం ఇచ్చి సగం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసేవారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ప్రజాశక్తి సివిల్ సప్లై డిటిని సంప్రదించగా.. వీఆర్వోని పూర్తి దర్యాప్తు చేసి సమగ్ర నివేదిక ఇమ్మని ఆదేశించినట్లు తెలిపారు.