- పీలేరు తహశీల్దారు కార్యాలయం వద్ద జెఏసి ధర్నా
ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయీలను వెంటనే చెల్లించాలని పీలేరు జెఏసి డిమాండ్ చేసింది. జిల్లా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు శనివారం భోజన విరామ సమయంలో స్థానిక తహశీల్దారు కార్యాలయంఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం 12వ పీఆర్సీ వేసినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని జెఏసి నాయకులు వాపోయారు. 12వ పీఆర్సీ ఆలస్యమౌతుండడంతో 30 శాతం ఐఆర్ ను ప్రకటించాలని, పీఎఫ్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే వాటిని మంజూరు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో పీలేరు జెఏసి నాయకులు, సభ్యులు పాల్గొని తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు.