ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని అసంపూర్తిగా ఉన్న ఆతవ గ్రామ సచివాలయ భవనం ఆవులకు నిలయంగా మారింది. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 45 లక్షలు మంజూరు చేసింది. కానీ నిధులు సకాలంలో రాక నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మధ్యలో నిలిచిపోయాయి. నిర్మాణం పనులు ప్రారంభించి నాలుగున్నరేళ్లు అవుతున్నా నిధులు రాకపోవడంతోనే పనులు పూర్తి చేయలేదని కాంట్రాక్టరు చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ నిర్మాణాలు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో సిబ్బంది గత ప్రభుత్వం నిర్మించిన పాత భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఇంజనీరింగ్ అసిస్టెంట్ను వివరణ కోరగా బిల్లులు అప్లోడ్ చేశామని మంజూరైన వెంటనే నిధులు చెల్లిస్తామని చెప్పారు. కాగా ఈ గ్రామం ఏకగ్రీవంగా ఎన్నికైందని సర్పంచ్ అసలు అభివృద్ధిపైన దృష్టి పెట్టడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.