ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ రాష్ట్రంలో ఇండియా వేదిక బలంగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. శనివారం రాజంపేటలోని ఎఐటియుసి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డితో తనకు 1970 నుంచి ఆత్మీయ పరిచయం ఉందని, ఆయనలోని ఒక్క సుగుణం కూడా తన తనయుడు జగన్మోహన్ రెడ్డికి రాలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కేంద్ర బిజెపి వద్ద మోకరిల్లి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర అభివద్ధిని అటకెక్కించారని విమర్శించారు. రాజంపేటలో వైసిపి నాయకుల ఇసుక అక్రమ రవాణా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకపోయిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి, చెల్లి, బాబాయిలను మోసగించి తాను అమాయకుడునని చెప్పుకుంటున్నారని అన్నారు. కిరణ్కుమార్రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి కాలంలో కాంగ్రెస్ పార్టీని అధఃపాతాలానికి నెట్టేశారని ఆరోపించారు. ప్రపంచ శాంతి సంఘం నుంచి కడపకు గతంలో అవార్డు దక్కిందని, అటువంటి ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా సిపిఐ నుంచి పంజం నరసింహారెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా సిపిఐ ప్రస్థానం ఘనంగా సాగిందని గుర్తు చేశారు. నేడు అదే సిపిఐ నుంచి ఇండియా కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా బుక్కే విశ్వనాథ నాయక్ బరిలో నిలిచారని ఉత్సాహవంతుడు, యువకుడు, మరి ముఖ్యంగా శ్రామిక వర్గం నుంచి వచ్చిన నాయకుడు కావడం చేత పేద ప్రజల గళం చట్టసభలలో వినిపిస్తాడని అన్నారు. విశ్వనాధ్ నాయక్, కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి బషీద్ లను నియోజకవర్గ ప్రజలు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వ రయ్య, జిల్లా కార్యదర్శి పి.ఎల్ నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్, చిట్వేలి రవికుమార్ పాల్గొన్నారు.